NEW TRAVELOGUES

Tuesday, 29 November 2011

Please see my travelogue published in Andhrajyothy on 27-11-2011

ట్రావెలోకం
మనసు 'కదిలె'

'కదిలె' ప్రాంతం ఎంత బావుంటుందో తెలుసా? ఒకసారి రాకూడదూ'' అని బంధువులు చెబితే ఆదిలాబాద్ జిల్లాలోని ఆ ఊరికి మొన్న దీపావళి సెలవుల్లో వెళ్లాం. హైదరాబాద్‌లో ఉదయం 9 గంటలకు బయలుదేరిన మేము 210 కి.మీ. ప్రయాణించి.. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్మల్ చేరుకున్నాం. అక్కడి నుంచి భైంసా రూటులో 12 కి.మీ. తిరిగి కుడివైపుకు మరో మూడు కిలోమీటర్లు వెళ్లగానే ఎత్తయిన సత్శల కొండలు ఎంతో అద్భుతంగా కనిపించాయి. కొండల మధ్యలో నుంచి వెళుతూ.. రెండు మూడు పల్లెలు దాటిన తరువాత ఒక లోయలో ప్రశాంతమైన ప్రకృతితో మమ్మల్ని స్వాగతించింది.. 'కదిలె'.

రెండు ఎత్తయిన పర్వత సానువుల మ«ధ్య జన్మించి.. జలజలా ప్రవహిస్తోంది ఒక సెలయేరు. ఇది పాపహరేశ్వరాలయం మీదుగా ఉత్తరం వైపు లోయమార్గంలోకి పరుగులిడుతోంది. ఈ సెలయేరుకు ఇరు వైపులా 50 మీటర్లకు పైగా ఎత్తున్న చెట్లున్నాయి. నీటి మధ్యలో కూడా పొడవాటి వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. ఆలయానికి ఈశాన్యంలో సెలయేరుకు అడ్డంగా కట్టిన డ్యామ్ పైనుంచి దుముకుతున్న నీరు జలపాతాన్ని తలపిస్తోంది. సెలయేరులో నడుచుకుంటూ ఒక ఫర్లాంగు దూరం వెళ్లగానే కుడివైపున ఒక ఆశ్రమం కనిపించింది. దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఆ ఆశ్రమ స్వామీజీ.
ఆశ్రమం ముందు పెద్ద వట వృక్షాలు, వాటి చుట్టూ విశాలమైన ఆవరణ ఉంది. ఆశ్రమం దాటి ఆ సెలయేరు ఇంకా ఎంత దూరం ప్రవహిస్తుందో తెలియదు.
మేము మాత్రం ఇంకొంచెం దూరం నడిచి చిన్నపిల్లలకు కాళ్లు నొస్తాయేమోనని వెనుదిరిగాం. ఆకాశాన్ని తాకే చెట్ల మధ్య, పక్షుల కేరింతల మధ్య, నీటి గలగలల మధ్య నడవడం ఒక మధురానుభూతి. ఆ దృశ్యాలన్నిటినీ కెమెరాల్లో బంధించాం.

కదిలే శివలింగం..
ఆలయానికి తూర్పు వైపున తప్ప మిగతా అన్ని వైపులా ద్వారాలున్నాయి. ఉత్తరం వైపున్న ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన శృంగి, భృంగి విగ్రహాలున్నాయి. వాటిని దాటి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు కోష్ట విగ్రహాలుగా బ్రహ్మ, గజానన, ఉమామహేశ్వరి, వరాహావతారం, విష్ణు విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయానికి ఆనుకుని ఈశాన్యంలో దక్షిణాభిముఖంగా అన్నపూర్ణ మాతా మందిరం ఉంది. ఆలయం ముందున్న నవరంగ మంటపంలో శిల్పకళతో అలరారే నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నంది చెవిలో మన చెవి పెట్టి వింటే 'ఓం నమః శివాయ' అని వినిపిస్తుందని పూజారి చెప్పారు.

నాకు మాత్రం అక్కడి సెలయేరు సవ్వడి, పక్షుల కువకువలు, చెట్లపై వీస్తున్న గాలి చప్పుడే లౌడ్‌స్పీకర్‌లో పెట్టి వినిపించినంత స్పష్టంగా వినిపించాయి. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది కదులుతుంది. భార్గవ రాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపిన తర్వాత పాపపరిహార నిమిత్తం దేశంలో 31 శివలింగాలను ప్రతిష్టించాక.. ఇక్కడికొచ్చి 32వ లింగాన్ని పెట్టాడట. అయితే ఈ శివలింగం కదలడంతో తనకు శివుడు ప్రసన్నుడైనాడని ఆయన భావించినట్లు చెబుతుంది స్థల పురాణం. వాస్తవంగా గుట్టల్లో నుండి ఉబికి వస్తున్న నీటిబుగ్గ చుట్టూ పానవట్టాన్ని బిగించి, సరిగ్గా ఆ బుగ్గపైనే శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో.. అది నీటి తాకిడికి కదులుతోంది. ప్రకృతి సౌందర్యానికి పవిత్రతను చేకూర్చేందుకే ఇలా చేశారనిపించింది.

ఆలయానికి దక్షిణంగా ఉన్న రెండు విశాలమైన గదుల్లో నిత్యాన్నదానం జరుగుతుంది. భోజనం తీసుకువచ్చామన్నా మమ్మల్ని కూడా తినమన్నారు ఆలయ నిర్వాహకులు. అక్కడ భక్తులు తమ ఇష్టసిద్ధి కోసం యాగాలు చేస్తున్నారు. ఆలయానికి ఈశాన్యంలో విశాలమైన, చదునైన ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆవరణలోనే ఏటా శ్రావణమాసంలో 30 రోజులపాటు జాతర, శివరాత్రి సందర్భంగా మరో 3 రోజుల జాతర నిర్వహిస్తున్నారు.

18 చెట్ల వటవృక్షం..
ఆలయానికి కొంతదూరంలో 18 రకాల చెట్లు ఒకే మహా వటవృక్షంలో పుట్టి పెనవేసుకొని పెరిగాయి. ఈ వటవృక్షంలో మద్ది, మేడి, జీడి, వేప, రావి, టేవు తదితర చెట్లుండటం విశేషం. దాని చుట్టూ ప్రదక్షిణ పథం ఉంది. అందులో ప్రదక్షిణలు చేస్తూ.. వటవృక్షానికి నిర్ణీత సంఖ్యలో నూలుదారం చుట్టి.. దీని మొదలు దగ్గర పూజలు చేసినవారికి సంతానయోగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వటవృక్షం దగ్గరికి ప్రతినెలా పౌర్ణమి, అమావాస్యల రాత్రి వెయ్యేళ్ల సర్పం వస్తుందని, దాన్ని చూసినవారు ఇక్కడ చాలా మందే ఉన్నారని చెపుతారు.

పాప హరిణి..
ఇక్కడున్న దేవుని పేరు పాపహరేశ్వరుడు. సామాన్యులు 'పాపన్న' అంటారు. భక్తుల పాపాలను హరించే దేవుడు కావడంతో ఆ పేరు వచ్చింది. ఈ దేవాలయమున్న కొండల పేరు సత్మల కొండలు లేదా నిర్మల కొండలు. సత్+మల అంటే 'మంచికొండలు' అని, నిర్మల అంటే స్వచ్ఛమైన కొండలు అని ఏదైనా అర్థం ఒకటే. ఈ ప్రదేశాన్ని దర్శించినవారికెవరికైనా ఇక్కడి కొండలు, లోయలు, చెట్లు, గాలులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, అవి మన ఆరోగ్యానందాలకు ఎంత ఉపకారం చేస్తాయో అనుభవంలోకి వస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పే బోర్డులు కనిపిస్తాయి. అంగ వస్త్రాన్ని తీసేశాకే భక్తుల్ని లోపలికి అనుమతిస్తారు.

లోయలో ఉన్న ఈ ఆలయానికి పశ్చిమాన ఎత్తయిన పర్వతాలున్నాయి. అటు వైపు నుంచి వచ్చే చెడు గాలులు, కాస్మిక్ శక్తులను ఆ కొండలు ఆపి భక్తులను రక్షిస్తాయి. ఈ ప్రక్రియను సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో... పశ్చిమం వైపు 'శని' ఉంటాడని, ఇక్కడి దేవుడు అతని బారి నుండి భక్తులను కాపాడతాడని చెప్తారు. దేశంలో దేవాలయాలన్నీ తూర్పుకు అభిముఖంగా ఉండగా, ఇదీ, కాశ్మీర్‌లో ఉన్న మరొక ఆలయం మాత్రమే పశ్చిమాభిముఖంగా ఉన్నాయని చెపుతారు.

సప్తర్షి గుండాల వెనుక..
ఆలయం వెనుక పారుతున్న సెలయేరులో ఏడు గుండాలు ఉన్నాయి. వీటిని సప్తర్షి గుండాలని, జీడి గుండాలని కూడా పిలుస్తారు. ఔషధ మూలికలను కలుపుకొని వస్తున్న నీరు జీడి రంగులో ఉండడం వలన ఆ పేరు వచ్చింది. మొదటి గుండం పేరు ఋషి గుండం. ఇది 18 చెట్ల మహావృక్షం కిందుగా వస్తున్న నీటిసారంతో ఏర్పడింది. ఈ నీటిలో కొన్ని దినాలు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని, సుఖరోగాలు నశిస్తాయని, ఈ నీటిని పంట పొలాలపై పిచికారీ చేస్తే చీడ పురుగులు నశించి దిగుబడి పెరుగుతుందని స్థానికుల విశ్వాసం. ఈ చెట్లన్నీ మన ప్రాచీనులు సంతాన సాఫల్యతకై చేసే ఆయుర్వేద చికిత్సలో మూలికలుగా వాడేవే కాబట్టి ఈ విశ్వాసం వెనుక శాస్త్రీయత కూడా ఉందేమో. ఉదాహరణకు, వేప కీటక నాశిని. మేడి చెట్టు ఇనుప ధాతువునిస్తుంది. ఈ రోజుకూ డాక్టర్లు గర్భిణులను ఎండిన మేడిపండ్లను (అంజీర్) తినమనడం, వాటి ధాతువులతో చేసిన ఐరన్ సప్లిమెంట్ మందు గుళికలు ఇవ్వడం గమనార్హం.

రెండవ గుండు పేరు సర్వ పాపనాశిని గుండం. ఆవు మూతిలో నుంచి వస్తున్న నీటితో ఒక మేడి చెట్టు కింద ఏర్పడింది ఈ గుండం. హిరణ్యకశ్యపుణ్ణి చంపిన అనంతరం నరసింహస్వామి చేతి గోళ్ల నుంచి రక్తం కారిపోతూనే ఉంటే లక్ష్మీదేవి మేడి ఆకుల రసం పోసి ఆ రక్తస్రావాన్ని ఆపిందని 'గురుచరిత్ర'లో ఉంటుంది. అలాంటి హీలింగ్ పవర్ ఉన్న చెట్ల నుంచి వస్తున్న నీటిలో స్నానం చేస్తే రోగాలు హీల్ (నయం) అవుతాయంటే నమ్మొచ్చేమో.

అత్తా కోడళ్ల గుండాలు..
మూడవ, నాల్గవ గుండాల పేర్లు శివార్చన గుండం, పాలగుండం. గర్భగుడిలో శివలింగానికి చేసిన అభిషేకపు నీటితో, పాలతో ఈ గుండాలేర్పడ్డాయని ఆ పేర్లు పెట్టారు. ఐదవ నీటి గుండానికి శివతీర్థ గుండమని పేరు. దీనికి ఉత్తరాన ఉన్న ఆరవ, ఏడవ గుండాలకు సూర్య చంద్ర గుండాలని పేరు పెట్టారు. సూర్య గుండంలోని నీరు వేడిగా, చంద్రగుండంలోని నీరు చల్లగా ఉంటుంది. అందుకే ఆ పేర్లు. ఈ రెండు గుండాలను స్థానికులు అత్తాకోడళ్ల గుండాలని కూడా అంటారు.

వాస్తు శిల్పాల చరిత్ర..
ప్రధాన ఆలయానికి కొంత దూరంలో మరో చిన్న ఆలయముంది. దాన్ని ధ్యాన మందిరం అని పిలుస్తున్నారు. ఆలయ గర్భగృహానికి ఇరువైపులా రెండేసి చిన్న గదులున్నాయి. ఆ గదులు ధ్యానం చేయడానికి ఉద్దేశించినవని చెపుతున్నారు. కాని సూర్యగుండం మెట్ల మీద, ప్రధానాలయం కోష్టాల్లో శివునితోపాటు బ్రహ్మ, విష్ణు, అన్నపూర్ణ -ఉమ, గణపతుల విగ్రహాలు ఉన్నాయని గుర్తు చేసుకుంటే, ఈ ఐదు దేవతల మతాలను పంచాయతనం అంటారు కాబట్టి ధ్యాన మందిరంగా పిలుస్తున్న ఆలయం మొదట పంచాయతన ఆలయమే అని చెప్పడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.

పైగా ఈ రెండు ఆలయాల శిఖరాలు, వాటికున్న ఎత్తయిన అరుగులు, స్తంభాలు చాళుక్యరీతిలో ఉన్నాయి కాబట్టి.. చాళుక్యులు పంచాయతన మతాలను పోషించారన్న వాదన సమర్థనీయంగానే కనిపిస్తోంది. చాళుక్యులు తెలంగాణను క్రీ.శ 560 నుంచి 753 వరకు ఒకసారి, క్రీ.శ.973 నుంచి 1160 వరకు మరోసారి పరిపాలించారు.
ఇక్కడి లింగం 32వదని, కర్నూలు జిల్లా యాగంటిలోని శివునితో సంబంధం కలదని స్థలపురాణం చెప్పడంలో ఓ ఆంతర్యం ఉంది. అదేమిటంటే- ఈ రెండు స్థలాల మధ్య చాళుక్యుల సామ్రాజ్యం విస్తరించడం.
ఇలా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన 'కదిలె' ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ తమ బాసర ఇక్కడికి 60 కిలోమీటర్లు. కుంటాల జలపాతం ఇక్కడికి 50 కిలోమీటర్లు. టూర్లలో భాగంగా చేర్చి ప్రచారం చేస్తే బాగుంటుంది.

- డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, ఫోన్ 9440687250

5 comments:

  1. chala bavundi saru gaaru

    ReplyDelete
  2. Dattu nzb sridatta18609@gmail.com25 January 2012 at 03:26

    satyanaraayana gaaru mee krushini telangaana yavat jati garvistundi.All d best ever forever
    -urs Dattu nzb

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Sir ... Thanks for giving valuable information about ancient history of telangana ....
    If don't mine .... Meru velle sahasa yatra ki ... Nenu kuda vastanu......naa expenses nenu chuskunatanu...
    History ante chala istam... ....
    Nenu m.pharmacy student ni, PhD ki prepare avtunna... Present ga gr2 ki prepare avtunna 2 yrs nunchi.... Naaku ancient history telusukodam ante chala istam... So please .... Sir meru OK ante nenu kuda vastanu....
    Address
    S.Radhakrishna
    radhakrishnasandha@gmail.com
    Cell no: 8985204749

    ReplyDelete